స్వామి వివేకానంద సూక్తులు

ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం.కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.

ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.

అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.

జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి.

ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి.

పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేడమే పూజలన్నింటి సారం.

దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది.

ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.

నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.

నా సోదరులారా! మనం పేదలం,అనామకులం.కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.
అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.

వ్యాకోచమే జీవనం,సంకోచమే మరణం. యావత్తు ప్రేమ వ్యాకోచం,యావత్తు స్వార్ధం సంకోచం.కనుక ప్రేమ మాత్రామే ఏకైక జీవన ధర్మం.

అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసమూ లోకంలోని అతిసాహసవంతులూ,సర్వోత్తములూ త్యాగం చేయాలి. అనంత ప్రేమ కరుణ గల వందల కొద్దీ బుద్దులు అవసరమై ఉన్నారు.

లోకానికి కావలసింది శీలం.ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో,నిస్వార్ధమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం. ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింప చేస్తుంది.

మతం సిద్ధంతాలలోనూ,రాద్ధాంతాలలోనూ,ప్రజ్ఞావాదాలలోనూ లేదు. మతం అంటే మన స్థితి,మన పరిణతే.మతమంటే సాక్షాత్కారానుభవమే.

మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కాని దానిని అనుసరించడానికి కాదు.
ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.

సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు,కానీ దేనికొరకైనా సత్యాన్ని త్యజించకూడదు.

మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు.
మృగత్వం,మానవత్వం,దివ్యత్వం-ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు.

గులాబి పువ్వు తన పరిమళాన్ని గుబాళించేటట్లు,నువ్వు దానం చేయి. ఇస్తున్నాననే స్ప్రుహ లేకయే ఇవ్వటం దాని ధర్మం.

లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు.

ప్రకృతిని ప్రేమించు,అందాన్ని ఆస్వాదించు,మంచిని ప్రోత్సహించు,విజ్ఞానానికిచేయుతనివ్వు..

పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతిగొప్ప పాఠం.

ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగి పోతాయి.

మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు.

ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు.

No comments:

Post a Comment